Sunday, 5 July 2015

గోదావరి

పవిత్ర గోదావరి నది పుష్కరాల సందర్భముగా చాలా దూర తీరాలనుండి భక్తులు రాజమండ్రి నగరానికి  పుణ్య నదీ స్నానాలకి, పితృతర్పణలు ఇవ్వడానికి తరలి వస్తారు. వారికి తూర్పు గోదావరి జిల్లా లో ఉన్న కొన్ని పుణ్య తీర్థాలని దేవాలయాలని పరిచయం చెయ్యడానికి ఈ టపా. రోజుకొక ప్రదేశము గురించి పవిత్ర గోదావరి నది పుష్కరాల సందర్భముగా వ్రాస్తున్న టపాలో  రోజు టపాగా
గోదావరి
మహారాష్ట్రలోని నాశికాత్రయంబకము వద్ద పుట్టిన గోదావరి తన నడకలలో పూర్ణ, ప్రవర, ఇంద్రావతి, మంజీర, బిందుసార, శబరి ఇంకా ఎన్నో  అనేక ఉప నదులను కలుపుకుంటూ ఆంఢ్రదేశములో ప్రవేశించి ధవళేశ్వరం వద్ద 7 పాయలై సప్త గోదావరియై చిట్ట చివర బంగాళాఖాతములో కలిసిపోతుంది. సప్త ఋషులు ఈ గోదావరిని తీసుకొచ్చారు గనుక అది వారి వారి పేరు మీద 7 పాయలయ్యింది అంటారు. అవి.. గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ,కశ్యప, తుల్య  ఇందులో అన్నీ ప్రవహించే నదులు కావు. కొన్ని అంతర్వాహినులు. అవి ఆత్రేయ, భరద్వాజ, తుల్య, కశ్యప.. వశిష్థ గౌతమితో కలిసే ఉంటుంది. ఈ సప్త గోదావరులూ అంతర్వాహినిగా ప్రవహించి ద్రాక్షారామము వద్దగల కోనేటిలో దర్శనమిస్తాయి అని అక్కడ ఉన్న పుష్కరిణికి సప్త గోదావరి అని పేరు. చిట్ట చివర గోదావరి ఒక పాయ కోటిపల్లి మీదుగా ప్రవహించి యానం వద్ద బంగాళాఖాతములో కలుస్తుంది. అలాగే ఇంకొక పాయ గౌతమి వశిష్ఠతో కలిసి అంతర్వేది వద్ద బంగాళాఖాతాన్ని చేరుతుంది. . ఈ సప్త గోదావరులలో స్నానం చేసిన ఫలితాన్ని పొందాలి అనుకుంటే ద్రాక్షారామము లోని పుష్కరిణిలో చేస్తే వస్తుంది అని అక్కడి స్థల పురాణము. పుష్కర సమయములో అనగా ఆ పన్నెండు రోజులు ఏ పుణ్య కార్యము చేసినా అది అనంతమైనదని పెద్దలు చెబుతారు. పుస్కరుడు జలములందు ఉండగా నదీ స్నానము చేస్తే సర్వ పాపములు పోయి మోక్ష ప్రాప్తి కలుగుతుందని సనాతన ధర్మమునందు విశ్వాసమున్న ప్రతివారు నమ్ముతారు. అదేవిధముగా గోదావరి నదికి గల అంత్య పుష్కరాలలోనూ చెయ్యాలి అని పెద్దల ఉవాచ. గోదావరి.. గోదావరి నదీ తీరము తలుచుకోగానే జ్ఞాపకం వచ్చేవి ఒకటి భద్రాచలము రెండు రాజమండ్రి.భస్రాస్రి లో జరిగే శ్రీ సీతారాముల కల్యాణము జత్ ప్రసిద్ధి పొందింది. రాజరాజనరేంద్రుడి పాలనలో నిర్మింపబడిన నగరము ఆయన పేరు మీద రాజమహేంద్రపురము ప్రస్థుత రాజమండ్రిగా ఉన్నాయి. రాజమండ్రి అనగానే గోదావరి నది, ధవళేశ్వరం ఆనకట్ట, కాటన్ దొర. ఇంకా వెనక్కి వెళ్తే తెలుగునాట ప్రతి ఇంటిలోనూ రోజులో ఏదో ఒక సమయములో ఉచ్చరింపబడే మాట మహాభారతము. రాజరాజమరేంద్రుడి కోరిక మీదనే కవిత్రయములో మొదటివాడు నన్నయభట్టారకుడు మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడం ప్రారంభించాడు. ఆ ఆదికవి పేరు మీద నన్నయ యూనివర్శిటీ రాజమండ్రిలో ప్రారంభమయ్యింది. 
ఇంక ప్రస్థుత జీవితములో ఒక భాగముగా కలిసిపోయి మనము మమేకమౌతున్న సినిమాలు.  గోదావరి అనగానే సినిమాలలో, మూగమనసులు, అందాలరాముడు, సాక్షి గుర్తుకొస్తాయి. వాటిలో గోదావరి అంత బాగా చిత్రీకరింపబడటమేకాదు ఆ సినిమాలలో ఒక పాత్ర అయింది అనే చెప్పాలి. గోదావరి గురించి ఆ తీరం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.  సామాజిక పరముగా ఆనాడు సంఘంలో ఉన్న దురాచారాలని రూపుమాపాలని కందుకూరి వీరేశలింగం పంతులుగారు, చిలకమర్తి ఇంకా ఎందరో మహానుభావులు... ఇలా గోదావరి-సాహిత్యము, గోదావరి-సాంఘిక సంస్కరణలు, గోదావరి--రాజకీయాలు, గోదావరి-సినిమాలు, గోదావరి-కళాకారులు అంటూ రాసుకుంటూ పోతే...???..  ఇక్కడితో ఆపేస్తాను ఈనాటికి.

No comments:

Post a Comment